Araku MP Kothapalli Geetha lashed out at YSR Congress chief YS Jagan Mohan Reddy and Chief Minister Nara Chandrababu Naidu
అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకసభ వాయిదా పడిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఏపీ ఎంపీలు పదేపదే నిరసనలు వ్యక్తం చేస్తుండటంతో స్పీకర్ సభను మార్చి 5వ తేదీకి వాయిదా వేశారు ఆ తర్వాత కొత్తపల్లి గీత మాట్లాడారు. పార్లమెంటులో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు అంతా ఓ డ్రామా అని మండిపడ్డారు. ఈ డ్రామాలు వద్దని అభిప్రాయపడ్డారు. అందులో చిత్తశుద్ధి, నిజాయితీ లేదని ఆమె అభిప్రాయపడ్డారు. గీత గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి, ఆ తర్వాత టీడీపీకి దగ్గరై.. ఇప్పుడు ఇరు పార్టీలకు సమానదూరం పాటిస్తున్నారు. ఆమె జనసేన వైపు చూస్తున్నారని కూడా గతంలో ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలో ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబుకు, వైసీపీ అధినేత జగన్కు షాకిచ్చే వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సమస్యలపై టీడీపీ, వైసీపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదని చెప్పారు. అసలు వైసీపీ వైఖరి ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదని చెప్పారు.
ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీయే మంచిది అని అప్పట్లో సన్మానాలు చేయించుకున్నారని టీడీపీని ఉద్దేశించి కొత్తపల్లి గీత దుయ్యబట్టారు. రెండంకెల వృద్ధి రేటు అని చెప్పుకునే వాళ్లు ప్రత్యేక హోదా ఎలా అడుగుతారని ప్రశ్నించారు.